సార్వత్రిక సమ్మెలో రెండో రోజు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు
ఉప్పల్ జోన్ బృందం, మార్చి 29 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ.. ధర్నాలు చేపట్టారు. కాప్రా సర్కిల్ కార్యాలయం, చర్లపల్లి డివిజన్ పరిధిలోని హెచ్పీసీఎల్, భారత్, ఐఓసీఎల్ గ్యాస్ పరిశ్రమలు, పారిశ్రామికవాడలో, ఈసీఐఎల్, ఉప్పల్, రామంతాపూర్, కాప్రా, తదితర ప్రాంతాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్కేవీ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించి.. ధర్నాలు చేపట్టి.. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కోట్లాదిమంది పాల్గొన్నారని, సమ్మె విజయవంతం అయిందని అన్నారు.
కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ ఎనిమిదిగంటల పనివిధానాన్ని తుంగలో తొక్కి 12గంటల విధానాన్ని అమలుపర్చాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను ఉల్లంఘించడంతో పాటు దేశ రక్షణలో కీలకమైన డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మారుతీరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వీఆర్ బోస్, ఏఐటీసీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్రావు, మున్సిపల్ యూనియన్ కార్మిక సంఘం కాప్రా సర్కిల్ అధ్యక్షుడు కుర్మన్న, ఏఐటీయూసీ కాప్రా ప్రధాన కార్యదర్శి సాయిలు, టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య , టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు తిప్పని సంపత్కుమార్ , ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీహెచ్ భాస్కర్రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.