ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
లబ్ధిదారులకు వాహనాలు అందజేత
గోల్నాక, జూన్ 8: దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, విజయ్కుమార్గౌడ్, తహసీల్దార్ చంద్రకళ, ఎస్సీ ఈడీ రమేశ్ తదితరులతో కలసి 26 మంది లబ్ధిదారులకు కార్లు, ఆటో ట్రాలీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేస్తున్నామన్నారు.
రెండో విడుతలో త్వరలోనే 15వందల మంది కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామన్నారు. లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు జీవితంలో స్థిరపడాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ పిలుపు నిచ్చారు. అంబర్పేట నియోజవర్గానికి సంబంధించి ఇప్పటికీ ఎంపిక చేసిన వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద ఒక్కక్కరికీ రూ.10లక్షల చొప్పున యూనిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉం టా.. గతంలో బ్యాం కుల ద్వారా అందే రుణాల కోసం చాలా ఇబ్బందులు పడ్డా.. ఇప్పటి వరకు యజమానుల వద్ద పని చేసేవారమని ఇప్పడు తామే యజమానిగా మారడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ చేసిన మేలు జీవితంలో ఎప్పటికీ మరవలేము.
–రూబి స్టీవెన్సన్, లబ్ధిదారుడు