హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఎస్హెచ్వోలు, ఏసీపీలతో పాటు గణేశ్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు.
పది రోజుల పాటు కొనసాగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. పోలీసులకు సహకరించి, శాంతి భద్రతలను కాపాడాలన్నారు. గణేశ్ నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను సీపీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు.