Yadadri | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తికి లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బుధవారం మినిట్స్ను విడుదల చేసింది. గతంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి జారీచేసిన పర్యావరణ అనుమతి (ఈసీ)ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సస్పెండ్ చేసింది. స్వదేశీ బొగ్గుతోపాటు, విదేశీ బొగ్గును ఉపయోగించేందుకు అనుమతులున్న ఈ ప్లాంట్ను స్వదేశీ బొగ్గు మాత్రమే వినియోగించేలా నిర్మిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఈసీ ఉత్తర్వుల్లో పలు సవరణలు చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సూచించింది. రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచర్లలోని వీర్లపాలెంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే.
అక్టోబర్ చివరిలోగా ఉత్పత్తి షురూ
యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు లైన్ క్లియర్ కావడంతో త్వరలో ఈ ప్లాంట్ను వినియోగంలోకి రానున్నది. తొలుత స్ట్రీమ్ జనరేటర్లు, ఇతర యంత్రాల పనితీరును పరిశీలించి అక్టోబర్ చివరిలోగా ఈ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో రెండు ప్లాంట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు టీఎస్ జెన్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.