సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నిషేధిత నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ అమాయక రైతులను మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ల పరిధిలో ఛేదించిన మూడు వేర్వేరు కేసుల్లో 10 మంది నిందితులను అరెస్టు చేసి, వారివద్దనుంచి రూ.95లక్షల విలువజేసే 3.35 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 14,850 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన తుర్క అలీషా అలియాస్ భాషా కర్నూల్లోని గౌతమి సీడ్స్ కంపెనీకి పత్తి విత్తనాల ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా ఆయా విత్తనాల కంపెనీల నుంచి ఫౌండేషన్ విత్తనాలను సేకరించి సాగు చేయడానికి రైతులకు అందజేస్తాడు. వచ్చిన పంటను జిన్నింగ్ కంపెనీలకు పంపి అక్కడ పత్తి నుంచి విత్తనాలను వేరుచేయిస్తాడు. ఈ ప్రక్రియ తరువాత వచ్చిన విత్తనాలను తిరిగి జర్మినేషన్ టెస్ట్ కోసం గౌతమి సీడ్స్ కంపెనీకి పంపుతాడు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 5 టన్నుల విత్తనాలను గౌతమి సీడ్స్ కంపెనీకి ఇవ్వగా.. అందులో 800 కిలోల విత్తనాలు జెర్మినేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయిన బీటీ3-హెచ్టీ పత్తి విత్తనాలను సదరు కంపెనీ అలీషాకు తిరిగి ఇచ్చేసింది. సాధారణంగా జెర్మినేషన్ పరీక్షలో ఫెయిలైన విత్తనాలను ధ్వంసం చేయాలి. అయితే, వాటిని ధ్వంసం చేయకుండా డబ్బు ఆశతో ఆ విత్తనాలను కర్నూల్ శివారు ప్రాంతంలోని ఒక గోదాంలో నిల్వ ఉంచాడు.
ఈ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించాలని భావించిన నిందితుడు చేవెళ్లకు చెందిన రాజును విత్తనాలు ప్యాక్ చేసే సంచుల కోసం సంప్రదించాడు. అందుకు రాజు అంగీకరించడంతోపాటు మెటీరియల్, రోల్స్ కోసం వెంకటేశ్, వేణును సంప్రదించాడు. వెంకటేశ్, ఐడీఏ ఉప్పల్కు చెందిన బాబూరావు సహకారంతో రాజు విత్తనాలు ప్యాక్ చేసే సంచులను సిద్ధం చేశాడు. అందులో నూజివీడ్ సీడ్స్ పౌచస్- రాజా-430, విన్నర్-4700, ప్రభాత్ సీడ్స్- పీసీహెచ్-9620 బీటీ-2-6300, లమినార్ సీడ్స్, ఓసియా-559-బీటీ-2-380, ట్యాగ్ సీడ్స్ తదితర బ్రాండెడ్ విత్తనాల సంచుల్లో నిషేధిత నకిలీ విత్తనాలను ప్యాక్ చేసి చేవెళ్లలోని రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి, షాద్నగర్లోని సాద్వి హోటల్ వద్ద రాజు, వెంకటేశ్, వేణును రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
మరో కేసులో ‘పల్లవి సీడ్స్’ అనే బ్రాండెడ్ పేరుతో బీజీ3-హెచ్టీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వికారాబాద్కు చెందిన మల్లయ్యను అరెస్టు చేశారు. ఈ కేసులో 800కిలోల నిషేధిత బీజీ3-హెచ్టీ నకిలీ పత్తి విత్తనాలు, పల్లవి సీడ్స్ బ్రాండ్కు చెందిన 88 ప్యాకెట్లు, 4సెల్ఫోన్స్, వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 14,850 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలీషాపై గతంలో కూడా దుండిగల్ పీఎస్లో నకిలీ విత్తనాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు సీపీ వివరించారు.
ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి 7 కేసులను ఛేదించామని, ఈ కేసుల్లో మొత్తం 7.6 టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని రైతులను మోసగాళ్ల నుంచి రక్షించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ కేసులను ఛేదించిన ఎస్ఓటీ, స్థానిక పోలీసులను సీపీ అభినందించారు.