సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు. ఏదీ ఆలోచించకుండా.. చెప్పిన లింకులు, ఓటీపీ నంబర్లు చెప్పేస్తున్నారు. ఇంకొందరు పెట్టుబడికి రెట్టింపు లాభాలంటే.. అత్యాశకు పోయి.. లక్షలు పోగొట్టుకుంటున్నారు. మోసపోతున్న వారిలో ఎక్కువగా విద్యావంతులే ఉంటున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ చీటర్ల చేతిలో చిక్కి.. బాధితులవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్ నేరగాళ్లు రూ. 41. 24 లక్షలు టోకరా వేశారు.
బీఎన్రెడ్డినగర్లోని చైతన్యనగర్లో నివాసముండే సదరు సాఫ్ట్వేర్ ఇంజినీర్కు +1(585)501-4299 నంబర్ నుంచి వాట్సాప్కు సందేశం వచ్చింది. పార్ట్టైమ్ జాబ్.. రోజు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు సంపాదన అని ఉంది. అందులోని లింక్ను బాధితుడు క్లిక్ చేయగానే టెలీగ్రామ్లో జావా898 ఐడీకి వెళ్లడంతో అందులో పార్ట్టైమ్ జాబ్ గురించి వివరించారు. యూట్యూబ్ సబ్స్ర్కైబ్షన్ చేసే జాబ్ ఉందన్నారు. కేవలం కొన్ని లింక్లు పంపిస్తామని, దానికి మేం చెప్పినట్లు చేస్తే ముందుగా మీకు బోనస్ పాయింట్ల కింద డబ్బు వస్తాయంటూ నమ్మించి నూ. 2500 బాధితుడికి పంపించారు. ఆ తరువాత ప్రీపెయిడ్ టాస్క్లుంటాయని, ముందుగా వెయ్యి పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ సూచించారు. ఆ తరువాత వజీరెక్స్6.విఐపీ అనే సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టగానే రూ. 1400 తిరిగి వచ్చాయి.
నమ్మకం కుదరడంతో బాధితుడు పలు దఫాలుగా యూపీఐ ఖాతాల నుంచి నేరగాళ్లు సూచించినట్లు 17 దఫాలుగా రూ. 41,24000 డిపాజిట్ చేశాడు. డబ్బు పంపిస్తుండడం, ఆ డబ్బుతో పాటు అప్పటికే బకాయి ఉన్న సొమ్ముకు సంబంధించిన అంకెలు స్క్రీన్పై కన్పిస్తుండడం, వాటిని డ్రా చేసుకోవాలంటే మరో టాస్క్ పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తూ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించిన సైబర్నేరగాళ్లు..సాఫ్ట్వేర్ ఇంజినీర్ను మోసం చేశారు. బాధితుడు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.