సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రుణం ఇస్తామంటూ ఓ మాజీ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.30 లక్షలు టోకరా వేశారు. సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లకుంటకు చెందిన మాజీ ఉద్యోగి రుణం కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. రిలయన్స్ ఫైనాన్స్ పేరుతో ఉన్న ప్రకటన చూసి, క్లిక్ చేశాడు. ఆ తర్వాత కాల్ వచ్చింది. తాము రిలయన్స్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. రూ.53 లక్షల రుణం ఇస్తామంటూ ముందుకొచ్చారు.
అయితే, తొలుత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని, ఇందుకు సంబంధించిన డబ్బు డిపాజిట్ చేయాలని సూచించి, డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, జీఎస్టీ, మెడికల్ చెకప్.. తదితర పేర్లు చెబుతూ సంవత్సర కాలంగా బాధితుడి వద్ద నుంచి రూ. 30 లక్షలు లాగేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.