సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్ట్టైమ్ ఉద్యోగమంటూ ఓ మెసేజ్ వచ్చింది. స్పందించిన బాధితుడు.. ఆ లింక్ క్లిక్ చేయడంతోనే వాట్సాప్ నంబర్కు వెళ్లగా, మరో మెసేజ్ వచ్చింది. మేము మీకు ఒక యాప్ను ఇచ్చి, కొన్ని టార్గెట్లు ఇస్తాం.. ఆ టార్గెట్లను ఈజీగా పూర్తి చేయవచ్చు.. ఆ తర్వాత మీరు కొంత పెట్టుబడి పెట్టాలంటూ సూచించారు.
తొలుత తక్కువ మొత్తంతో డబ్బులు పెట్టుబడి పెట్టగానే లాభాలొచ్చాయి. దీంతో బాధితుడు తమ పెట్టుబడిని పెంచాడు. ఆ తర్వాత లాభాలు రాకపోవడంతో పాటు పెట్టిన సొమ్ముకూడా పోయింది. దీనిపై యాప్ నిర్వాహకులను బాధితుడు ప్రశ్నించాడు. మరికొంత మందిని ఈ గ్రూప్లో చేర్పిస్తే.. నీ డబ్బు నీకు వచ్చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ ఆ స్కీమ్లో చేరుతూ డబ్బులు పోగొట్టుకున్నారు. అందరూ నిండా మునిగిపోయారు. బాధితులు శుక్రవారం సీసీఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు.