సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాలైన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సైబర్క్రైమ్, మాదక ద్రవ్యాల ముప్పును గుర్తిస్తూ వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. 74వ బ్యాచ్కు చెందిన 195 మంది ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులు శనివారం బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ అండ్ కంట్రోల్ భవనం, టెక్నాలజీ ఫ్యూజన్, సంక్షోభ నిర్వహణ కేంద్రం, సీసీటీవీ, ఎనాలటికల్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పోలీసుల విధులు, సాంకేతిక అంశాలు, పరిపాలన, సమన్వయం తదితర అంశాలను వారు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 1847 నుంచి హైదరాబాద్ పోలీసింగ్, కొత్వాల్ వ్యవస్థ, హైదరాబాద్ పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పోలీసింగ్లో ఐటీ, సాంకేతికత, సంస్కరణల ప్రాముఖ్యత గురించి వివరించారు. సున్నితమైన, మతపరమైన అంశాలు, సామాజిక సమస్యలను పోలీసులు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, శాంతి భద్రతలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, శాంతి భద్రతలు బాగున్నప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంలో సాధిస్తున్న విజయాలపై ఆయన వివరించారు.
హైదరాబాద్లో హెచ్న్యూ, స్మాష్, రోప్, భరోసా కేంద్రాల పనితీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసింగ్లో వచ్చిన సాంకేతిక పరమైన మార్పులు, సాధిస్తున్న ఫలితాలను వివరించారు. వార్ రూమ్స్, ఐటీతో అనుసంధానమైన అప్లికేషన్లు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ప్రజలకు అందే సేవలు, విపత్తుల సమయంలో ప్రజలకు ఏవిధంగా సేవలందిస్తారనే అంశాలను తెలిపారు.తెలంగాణ సీఎం కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనతో కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటైందని తెలిపారు. సీసీసీ ఇన్చార్జి, డీసీపీ సునీతారెడ్డి, ఐటీ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.