సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఆడినట్లు తెలిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట నిషేధం. నేరుగా ఆడినా, ఆన్లైన్లో ఆడినా నేరంగా భావిస్తారు. దీంతో రాష్ట్రంలో ఈ ఆట ఆడేందుకు వీలులేదు. కొందరు నకిలీ జీపీఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో పేకాట ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు డబ్బులు పోయినా.. కేసుల భయంతో విషయం బయటపెట్టడంలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వ్యవస్థీకృత నేరాలలో ఒకటైన పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులు నిఘా పెంచారు. రాష్ట్రంలో నిషేధిత పేకాట ఎక్కడ ఆడినా చర్యలు తీసుకుంటూ.. అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు ఆఫ్లైన్ గేమింగ్పై నిఘా పెంచడంతో నేరగాళ్లు ఆన్లైన్ ఆటపై దృష్టిపెట్టారు. ఇది గుర్తించి పోలీసులు.. ఆన్లైన్లో పేకాట యాప్లు ఓపెన్ కాకుండా చేశారు. చైనా బ్యాక్ గ్రౌండ్తో ఉండి, గూగుల్ ప్లేస్టోర్స్తో సంబంధం లేకుండా కేవలం లింక్లతోనే ఓపెన్ అయ్యే యాప్లతో పాటు ఫేక్ జీపీఎస్ యాప్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ యాప్ల ద్వారా చాలా మంది ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నారు. ఇదే తరహా ఆటను ఆడిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు రూ. 95 లక్షలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి రోజు చాలా మంది వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. దీంతో సైబర్క్రైమ్ పోలీసులు ఈ ఆన్లైన్ రమ్మీ ఆటపై ప్రత్యేక దృష్టి సారించారు.
సమాచారం ఇవ్వండి..
కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆన్లైన్లో పేకాటలో పోగొట్టుకుంటున్న బాధితులు చాలా మంది ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు కూడా తరచూ సాఫ్టువేర్ను మారుస్తూ మోసం చేస్తుంటారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. తొలుత ఒకటి రెండు సార్లు బెట్టింగ్లో డబ్బులు వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత పోగొట్టుకుంటారు. ఈ గేమ్లో ఎంత మంది పాల్గొన్నా.. ఒకరిద్దరు మినహా మిగతా వారంతా గేమింగ్ నిర్వాహకులు, సిబ్బంది మాత్రమే ఉంటారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కుట్ర తెలియక చాలా మంది డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఆన్లైన్లో పేకాట ఆడటం నేరమే
పేకాటపై రాష్ట్రంలో నిషేధం ఉంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఇందులోకి వస్తాయి. కొందరు ఫేక్ జీపీఎస్ యాప్లు ఉపయోగిస్తూ, ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లు చూపించి ఆన్లైన్లో పేకాట ఆడుతున్నారు. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. కొంతమంది అప్పుడప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. డబ్బులు పోయాయనే భావనతో బాధితులుగా భావిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. ఆన్లైన్లో పేకాట ఆడటం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఆన్లైన్లో పేకాట ఆడుతున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్