సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. మోసానికి గురైన రెండు వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు అప్పగించారు. శుక్రవారం సీసీఎస్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ రూ.1,61,24,226 విలువైన ఆయా చెక్కులను బాధితులకు అందజేశారు.
ఓ బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ పేరుతో తైవాన్కు బుక్ అయిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఈ కాల్ను ముంబై సైబర్ క్రైమ్కు బదిలీ చేస్తున్నామంటూ బెదిరించారు. ఆ తరువాత బాధితుడిని బెదిరించి రూ.98,79,000 దోచేశారు. మరో కేసులో పేరున్న స్టాక్ బ్రోకర్స్మంటూ బాధితుడితో మాట్లాడిన సైబర్నేరగాళ్లు.. ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టాలంటూ సూచించి రూ. 1,04,80,000 కాజేశారు. ఈ ఘటనలపై సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితులు వెంటనే (గోల్డెన్ అవర్ 1930కు) ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు కేసుల్లోని ఆయా ఖాతాల నుంచి రూ. 80,76,198తో పాటు రూ.80,48,028 ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో ఫ్రీజ్ అయిన డబ్బు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు సీఆర్పీసీ 451 సెక్షన్ కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకొని.. బాధితులిద్దరికీ వేర్వేరుగా ఆయా ఖాతాల్లో ఫ్రీజ్ అయిన రూ. 1,61,24,226 అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతీ తదితర అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో మోసాలు చేస్తుంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యాశకు వెళ్లి.. వ్యక్తిగత, బ్యాంకు సమాచారం వారికి ఇస్తే.. ఖాతాల్లో ఉన్న నగదు దోచేస్తారని జాయింట్ సీపీ తెలిపారు. పార్టుటైమ్ జాబ్లు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పోలీసులమంటూ.. కొరియర్.. బిల్లుల పేరుతో ఎవరు ఫోన్చేసినా నమ్మవద్దని, భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక వేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కి ఫోన్ చేయాలన్నారు. ఘటన జరిగిన రెండు గంటల్లోపు (గోల్డెన్ అవర్) cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.