సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో పేకాట.. క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ భారీగా నష్టపోయాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశాడు. యూట్యూబ్, ఫేస్బుక్లో వీడియోలు చూసి స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోచంపల్లి పోలీసులు ఆరు గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. శుక్రవారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. పోచంపల్లికి చెందిన లక్ష్మమ్మ(65) ఊరిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్పై వచ్చిన యువకుడు ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు, ఆ గ్రామానికి వచ్చిపోయే మార్గాలపై పోలీసులు నిఘాపెట్టి నిందితుడిని ఆరు గంటల్లో పట్టుకున్నారు. విచారణలో అతడు హయత్నగర్లో ఉంటూ ఆర్టీఏ ఏజెంట్గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడికి పెళ్లి అయ్యిందని, ఆన్లైన్లో పేకాట, క్రికెట్ బెట్టింగ్, మద్యం మత్తుకు బానిసై దాదాపు రూ.20 లక్షలు నష్ట పోయాడని సీపీ తెలిపారు. దీంతో అతడికి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన పుట్టింది. స్నాచింగ్లు చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు యూట్యూబ్, ఫేస్బుక్లో స్నాచింగ్లు ఎలా చేయాలో చూసి, నేరాలు చేయడం మొదలు పెట్టాడని సీపీ వివరించారు.
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.50 లక్షల విలువజేసే 680 గ్రాముల బంగారు నగలు, 2479 గ్రాముల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ డీఎస్ చౌహాన్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్నగర్కు చెందిన రామకృష్ణ (35), చెన్నాపురం దేవేందర్నగర్ నివాసి కాగ్ గోవింద్ (36), మహేందర్ పవార్ (36), సంతోష్ (40) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో రామకృష్ణ ఆన్లైన్ గేమింగ్లో నష్టపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ నలుగురు కలిసి తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఈ ముఠా 22 చోరీలకు పాల్పడింది. చాలా కాలంగా తప్పించుకుతిరుగుతున్న ఈ ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కీసర పోలీసులను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఇన్చార్జి డీసీపీ గిరిధర్, కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.