శంషాబాద్ రూరల్, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శంషాబాద్ పట్టణంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారం కోసం దేవుడు, మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని వివరించారు. 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజలు ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగ్గిన బుద్ధి చెప్పాలని సూచించారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ నాయకులు అట్టడుగు వర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నారని, బీజేపీకి మరోసారి అధికారం కట్టబెడితే దేశం అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోతుందని తెలిపారు.
దేశంలోని ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం దోరికే విధంగా పోరాటలు చేసే ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, పుస్తకాల నర్సింగరావు, సైయ్యద్ అప్సర్, మండల కార్యదర్శి నర్రగిరి, ఏఐటీయూసీ నాయకులు జైపాల్ రెడ్డి, దత్తు నాయక్లతో పాటు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.