సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ), హైదరాబాద్ సిటీ పోలీస్లు (హెచ్సీపీ)సంయుక్తంగా బుధవారం బంజారాహిల్స్లోని తాజ్ డెక్కెన్ హోటల్లో సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ వార్షిక(హెచ్ఏసీకే) సమ్మిట్ – 2023ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరుగగా ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ, విశిష్ట అతిథిగా సినీ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ అనేది ప్రస్తుతం చాలా కీలకమైందని, సైబర్క్రైమ్ను ఎదుర్కోవడానికి పోలీసులు, ఐటీ పరిశ్రమలు, వ్యాపారులు కలిసి పనిచేస్తున్నాయన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఐటీ నిపుణులతో సమన్వయం చేసుకుంటూ సైబర్ సెక్యూరిటీపై విస్తృతంగా అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా హెచ్ఏసీకే వార్షిక కార్యక్రమం జరిగిందని, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్, మహిళా భద్రతకు సంబంధించిన అంశాలలోను ఇలాంటి సమ్మిట్లు నిర్వహిస్తామన్నారు.
ప్రస్తుతం సెల్ఫోన్ అనేది కీలకంగా మారందని, సైబర్ క్రైమ్పై చైతన్యం రావాలన్నారు. అందుకే స్కూల్ స్థాయి నుంచి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సమావేశంలో పద్మ శ్రీ డాక్టర్ బీవీ మోహన్రెడ్డి, మాజీ క్రీడాకారిణి జ్వాలా గుత్త, హెచ్సీఎస్సీ సలహాదారు భరణి, సెక్రటరీ జనరల్ చైతన్య గొర్రెపాటి, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
సైబర్నేరాలను అరికట్టడానికి భారీ స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి అందరికి అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని సినీ డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. సైబర్ నేరాలు దాదాపు సెల్ఫోన్ ద్వారానే ఎక్కువగా జరుగుతుంటాయి. అపరిచితుల ఎలాంటి వివరాలు ఇవ్వకూడదన్నారు. అలాగే హై ప్రొఫైల్ ఉన్న వారు సైతం మోసాలకు గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సైబర్నేరాలలో దురాశ, అవగాహన లోపంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయన్నారు. సైబర్నేరాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు విస్త్రతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.