ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 31 : రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారాలన్నారు. రౌడీషీట్ ఉన్నవారు నూతన సంవత్సరం సందర్భంగా నేర ప్రవృత్తిని మార్చుకుని.. సమాజంలో సాధారణ పౌరులుగా నూతన జీవితం ప్రారంభించాలని సూచించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎదుగుతారన్నారు. రౌడీషీటర్లు నేర వృత్తిని వదిలి, పిల్లలు మంచిగా ఎదిగేలా, హుందాగా జీవించేలా, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా బాధ్యత వహించాలన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశమిస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని.. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. మీ చుట్టూ జరిగే నేరాలపై సమాచారం అందించి.. సహకరించే వారికి, మార్పు వచ్చిన వారికి పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకీ ధారావత్, యాదాద్రి డీసీపీ రాజేశ్చంద్ర, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్రావు, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు.