సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం అర్థవంతమైన చర్చల నడుమ ముగిశాయి. తొలిరోజు అడ్వైర్టెజ్మెంట్, వీధి దీపాల నిర్వహణ, డిప్యూటేషన్ల అంశాలపై సభ్యులు, అధికారుల మధ్య చర్చ జరగగా..జీవో 68, అడ్వైర్టెజ్మెంట్ విభాగంలో అక్రమాలు, అధికారుల అవినీతిని సభ్యులు ఎండగట్టారు. ప్రశ్నోత్తరాలు మిగిలిపోవడం..బడ్జెట్ చర్చ ఉండడంతో సభను మంగళవారానికి వాయిదా వేయగా, రెండోరోజు శానిటేషన్, స్పోర్ట్స్, టౌన్ప్లానింగ్, సెల్ఫ్ అసెస్మెంట్, బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలను అరికట్టలేకపోతున్నారని, రాంకీ నిర్వహణ, అధికారుల పనితీరుపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీక్లీ మార్కెట్స్ నడిచే ప్రాంతాలు, డస్ట్ బిన్లు ఎత్తివేసిన ప్రాంతాల్లో చెత్త నిర్వహణ అధ్వాన్నంగా ఉందని పార్టీలకతీతంగా సభ్యులు మండిపడ్డారు.
స్వీపింగ్ మిషన్ల నిర్వహణ సరిగా లేదని లోపాలను ఎత్తిచూపారు. దీనిపై శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి సమాధానం ఇవ్వలేక తడపడ్డారు. చివరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోక్యం చేసుకొని అఖిల పక్షంతో హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో పాటు అడ్వైర్టెజ్మెంట్ అక్రమాలపై మరో హౌజ్ కమిటీ వేశారు. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూపొందించిన అంచనా బడ్జెట్ రూ.7,937 కోట్లకు కౌన్సిల్ ఆమోదించింది. 2024-25 బడ్జెట్పై కౌన్సిల్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రూ.3646 కోట్ల ఆదాయం చూపిస్తూ అన్ని ఖర్చు కలిపి రూ.3500 కోట్లు చూపుతున్నారని, ఈ నిధులతోనే ఏడాదంతా ఎలా అభివృద్ధి పనులు జరుపుతారో స్పష్టత లేదని ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అభ్యంతరం తెలిపారు. రూ.3వేల కోట్లు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్లో పెట్టాలని డిమాండ్ ఉన్నా రూ.1100 కోట్లు మాత్రమే పెట్టారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. రూ.3500కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల నిర్వహణపై పార్టీలకతీతంగా సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీజేఆర్ గ్రౌండ్స్లో మౌలిక వసతులు లేవని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. ఇండోర్ స్టేడియాల్లో ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాల వల్ల క్రీడాకారులకు అందుబాటులో ఉండడం లేదని, సమ్మర్ క్యాంపుల నిర్వహణ సరిగా లేదని అన్ని పార్టీల నుంచి కార్పొరేటర్లు స్పోర్ట్స్ విభాగం అధికారుల తీరును తప్పుపట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్కు రూ.10 కోట్లు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను నిలిపివేయడం దారుణమని భారతీనగర్ కార్పొరేటర్ సిందూ ఆదర్శరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్ఫ్ అసెస్మెంట్లో అవకతకలు జరుగుతున్నాయని, లోపాలను సరిదిద్దాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ను కమర్షిమల్గా మార్చుతున్న వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. హైటెక్సిటీ, సరూర్నగర్లో ఒకే లాగా ట్యాక్స్ వసూలు ఉంటుందని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు లక్షల్లో పైస్థాయి అధికారులకు లంచాలు ఇచ్చే స్థాయికి చేరారని బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంలో పెద్ద మొత్తం ఆదాయ పన్ను వసూళ్ల ద్వారానే సమకూరుతుందని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. నాన్ రెసిడెన్షియల్కు ఏ విధంగా ట్యాక్స్ ఫిక్స్ చేయాలన్నది చట్టంలో ఉందన్నారు. జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా డోర్ నెంబర్ రేషనలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. తద్వారా ఆదాయం పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. రెసిడెంట్, నాన్రెసిడెంట్పై ట్యాక్స్ వేర్వేరు రేట్లు ఉన్నాయని, రేట్ల మార్పుపై 2017, 2019లో జీవోలు వచ్చాయన్నారు. సెల్లార్లో ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తిపన్ను చెల్లింపులకు వన్ టైం సెటిల్మెంట్ పథకం మళ్లీ అమలు చేయాలని, కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కార్పొరేటర్లు మేయర్ను కోరగా, ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని కమిషనర్ చెప్పారు.
ప్రస్తుతం సీఎంగా రేవంత్రెడ్డి కొడంగల్కు నిధులు ఇచ్చినట్లే మల్కాజ్గిరికి కూడా ఇవ్వాలని కార్పొరేటర్ సునీతా యాదవ్ డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో నాలాలో పడి పాప చనిపోతే వచ్చి పరిశీలించారని, నాలా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.
జోనల్ అధికారులు కార్పొరేటర్ల ఫోన్లు చేసినా స్పందించకపోవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. డిప్యూటేషన్, ఎక్స్టెన్షన్ (రిటైర్డ్ ఉద్యోగుల) కొనసాగుతున్న అధికారులను సరెండర్ చేయాలన్నారు. ఎక్కువకాలం పనిచేస్తున్న, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారి లెక్కలు తయారు చేయాలని మేయర్ ఆదేశించారు. లిస్ట్ రెడీ అయ్యాక ప్రభుత్వానికి సరేండర్ లేదా ఇతర శాఖలకు వారిని పంపే ఆలోచన చేయాలని కమిషనర్కు మేయర్ సూచించారు.
కౌన్సిల్ మీటింగ్ కొనసాగుతున్న సమయంలో అనుమతి లేకుండా ఎస్బీ అధికారి రావడం చర్చనీయాంశమైంది. శానిటేషన్పై సభ్యులు ఆసక్తికర చర్చ జరుగుతున్న తరుణంలో కార్పొరేటర్లు కౌన్సిల్లోకి వచ్చే మార్గం ద్వారా సదరు ఎస్బీ అధికారి ఇబ్రహీం కౌన్సిల్ హాల్లోనికి వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా కౌన్సిల్ సమావేశంలోకి రాకూడదు. దీనిపై కౌన్సిల్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.
ట్యాక్స్ వసూళ్ల అంశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. పాతనగరంలో పెండింగ్ ట్యాక్స్పై కమిషనర్ ప్రకటన చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీనిపై ఎంఐఎం సభ్యుల మధ్య బీజేపీ కార్పొరేటర్ల మధ్య కొద్ది సేపు వివాదం జరగగా..ఇరువురి మద్య వాగ్వాదంతో సభకు కొద్ది సేపు మేయర్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మేయర్ జోక్యం చేసుకొని వివరాలను బీజేపీ కార్పొరేటర్లకు చేరవేర్చుతామని చెబుతూ అంశానికి ఫుల్స్టాప్ పెట్టారు. అంతకు ముందు శానిటేషన్పై చర్చ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వివాదం జరిగింది.