ఆదివారం గాంధీలో 7 కేసులు నమోదు
ఆందోళన అక్కర్లేదు.. స్వల్ప లక్షణాలే..
అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు మొన్నటి వరకు గాంధీ దవాఖానలో 2,3కే పరిమితమైన కరోనా ఐపీ కేసులు ఆదివారం 7కు చేరాయి. అయితే మన దగ్గర స్వల్ప లక్షణాలు గల రోగులే ఉంటున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఆందోళన వద్దు..
వేరియంట్ ఏదైనా వైరస్లతో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒమిక్రాన్ బీఏ 4, బీఏ5లు కొత్తవేరియంట్లే అయినా అందులో బీఏ 4 అనేది బీఏ 1, బీఏ 2ల మిశ్రమమే కావడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వరకే మన వద్ద బీఏ 1, బీఏ 2 వేరియంట్లు నమోదయ్యాయి. దీనివల్ల ఆ వేరియంట్లకు సంబంధించిన యాంటీబాడీస్ దాదాపు అందరికీ వచ్చేశాయి. ఇక బీఏ 5 వల్ల కూడా పెద్ద ప్రమాదకర కేసులు నమోదు కాలేదు. అంతేకాకుండా మన రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేట్ అయ్యారు కాబట్టి ఆందోళన అవసరం లేదు.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణులు,
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన
జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం పొరుగు రాష్ర్టాలలో కేసులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రభావం మనపై కూడా పడవచ్చు. ప్రస్తుతం మన దగ్గర కేసులు పెద్దగా లేవు. అయితే ఈ ఆదివారం మాత్రం మొత్తం ఐపీ కేసుల సంఖ్య 7కు చేరింది. ఈ కేసులన్నీ దాదాపుగా బీఏ 4, బీఏ 5 ఉంటున్నాయి. కొత్త వేరియంట్పై పూర్తిస్థాయి స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. అది వేవ్లా వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఒక వేళ వచ్చినా పెద్దగా భయపడాల్సిన పనిలేదు.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ గాంధీ దవాఖాన
కొత్త వేరియంట్లతో జాగ్రత్త..
ప్రస్తుతం నమోదవుతున్న కొత్త వేరియంట్లతో అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్లోని పలు రకాల వేరియంట్లతో మూడవ దశ ముగిసిన స్వల్ప విరామం తరువాత బీఏ 4, బీఏ 5 వంటి కొత్త వేరియంట్లు ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు వైద్యాధికారులను ఆదేశించారు. లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు జరపాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ఆరునెలలకు కొత్త మ్యుటేషన్లు
కరోనా తొలి దశ నుంచి మూడవ దశ వరకు పరిస్థితులను పరిశీలిస్తే వైరస్ మ్యుటేషన్ కావడానికి ఆరునెలల సమయం పడుతుందని, ఈ క్రమంలో ప్రతి ఆరునెలలకు ఒక కొత్త వేరియంట్ వస్తున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో అంటే జూన్ నుంచి ఆగస్టులో మధ్యలో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. అయితే వచ్చే కొత్త వేరియంట్లు ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమన్నారు.