ప్రాథమిక సహకార సంఘం తరఫున రుణాలు
సబ్సిడీపై రైతులకు విత్తనాలు, ఎరువులు
కీసర, మార్చి 26 : రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, పంట, దీర్ఘకాలిక, బంగారు రుణాలిచ్చి ఆసరాగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నారు. కీసరలోని ప్రాథమిక సహకార సంఘంలో మొత్తం 2120 మంది సభ్యులున్నారు. కార్యవర్గం కొలువుదీరి రెండేండ్లు పూర్తయింది. ఈ సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులకు సొసైటీ తరఫున పంట రుణాలు రూ.3 కోట్ల 60 లక్షల 33వేలు, దీర్ఘకాలిక రుణాలు రూ.74లక్షల 47 వేలు, బంగారం రుణాలు రూ.19లక్షలు ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నామని పాలకవర్గం, చైర్మన్ తెలిపారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతులకు పీఏసీఎస్ ద్వారా వారికి అవసరమైన రుణాలిస్తున్నాం. రెండేండ్లలో దరఖాస్తు చేసుకొన్న రైతులందరికీ దీర్ఘకాలిక రుణాలతో పాటు పంట రుణాలు అందించాం. సబ్సిడీ పై రైతులకు విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నాం. -రామిడి ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్
స్వరాష్ట్రంలో సంతోషంగా ఉన్నాం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు సంతోషంగా వ్యవసాయాన్ని చేసుకొంటున్నారు. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. సొసైటీ తరఫున పంట రుణాలు తీసుకున్నాం. సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు తగిన న్యాయం జరుగుతున్నది. -కొత్తారి రాములు, చీర్యాల్ రైతు