ఖైరతాబాద్, ఆగస్టు 22 : బీజేపీ ప్రభుత్వమంటే బుల్డోజర్లు….హిజాబ్ వివాదాలే కనిపిస్తాయని మత ఘర్షణలు సృష్టించి పబ్బం గడుపుకుంటారని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఎంఎస్మక్తాలోని అన్సారీ మసీదు వద్ద రూ.1.10కోట్లతో సీవరేజీ లైనును ప్రారంభించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు జరుగుతున్నాయని, మతాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. అశాంతి నెలకొల్పే ఆ పార్టీని ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. యూపీ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏ ఒక్కరో తప్పు చేస్తే కుటుంబానికి సంబంధించి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. కర్నాటకలో మొన్నటి వరకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హిజాబ్ ధరించవద్దని పేచీ పెట్టి మరీ ఘర్షణలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించినన్ని రోజులు మైనార్టీలలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గడిచిన 75 సంవత్సరాలలో ఎక్కువ శాతం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఆ వర్గాలకు చేసిందేమి లేదన్నారు. ఎన్నికలు రాగానే ముస్లింలు గుర్తు వస్తారని, వారిని ఓట్లుగానే చూస్తారు కాని వారి సంక్షేమం పట్టదన్నారు. ఎంఎస్ మక్తా ప్రజల కష్టాలు తనకు తెలుసునని, ఒకప్పుడు గ్రీన్ ట్రిబ్యూనల్లో ఉండేదని, ఈ ప్రాంతాన్ని తాను రెసిడెన్షియల్ జోన్గా మార్చడానికి తాను శ్రమించానని గుర్తు చేశారు. జీవో నంబర్ 58 ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ క్రమబద్ధ్దీకరణ చేస్తామన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారెవరైనా మళ్లీ చేసుకుంటే వారి సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఒకవేళ నోటరీ ఉన్నా, పొజిషన్ సర్టిఫికెట్, ఆధార్, కరెంటు, నీటి బిల్లులు ఉంటే చాలని వారంరికీ రెగ్యూలరైజేషన్ చేయించే బాధ్యత తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ కె. ప్రసన్న రాంమ్మూర్తి, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కె అహ్మద్, పి. నాగరాజు, నాయకులు గాయాసుద్దీన్, జలీల్, జకీర్ తదితరులు పాల్గొన్నారు.