హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసి కాంగ్రెస్ (Congress) తన చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలిపారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని నివృతిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగినన్ని అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరిందని, అందువల్ల నియోజకవర్గంలో అర్హులందరితో దరఖాస్తు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.