ఎల్బీనగర్, ఫిబ్రవరి 1 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్రెడ్డి, భవానీప్రవీణ్కుమార్, సామ తిరుమలరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచనల మేరకు మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్రెడ్డి, భవానీప్రవీణ్కుమార్, సామ తిరుమలరెడ్డి, బీఆర్ఎస్ నేతలు కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్బీనగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం ప్రజలకు మేలు జరిగేలా ఫ్రూట్ మార్కెట్ను షిఫ్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, పాత మార్కెట్ స్థానంలో అత్యాధునిక వసతులతో ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఎల్బీనగర్ ప్రజలకు ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటివేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు.
ఆస్పత్రి నిర్మాణానికి ఎన్ఓసీ రావడానికి ఒక్కో దశలో రెండు నెలలపాటు సమయం పడుతుందని తెలిపారు. దీనిపై కనీసం అవగాహన లేని కాంగ్రెస్ కార్పొరేటర్ లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. 2022, ఏప్రిల్ 26న సీఎం కేసీఆర్ పాత ఫ్రూట్ మార్కెట్ స్థలంలో అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారని గుర్తుచేశారు. ఆస్పత్రి నిర్మాణానికి టెండర్లు ముగిసి పనులు జరిగే సమయంలో కాంగ్రెస్ నేతలు, ఆపార్టీ కార్పొరేటర్ ధర్నాలు, రాస్తారోకోలు చేసి తాము నిలదీస్తనే ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయని గొప్పలు చెప్పుకోవడానికి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు దాదాపు వంద సంవత్సరాలకు అనుకూలంగా కొత్తపేటలో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించడానికి పూనుకుంటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.