బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి సారిగా షీ టీమ్స్ వ్యవస్థను తీసుకొచ్చి ఆకతాయిల గుండెల్లో వణుకు పుట్టించింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. అప్పట్లో షీ టీమ్స్ ఉన్నాయని మహిళలు గర్వంగా ధైర్యంగా తిరిగేవారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతను చూసి దేశంలోని పలు రాష్ర్టాలు షీ టీమ్స్ను ప్రవేశపెట్టాయి. ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు భద్రత, భరోసా కరువైపోయింది. నేడు షీ టీమ్స్ ఉన్నాయా? అనే ప్రశ్న తలెత్తున్నది. మల్కాజిగిరి సీపీ ఈ నెల 2న దిల్సుఖ్నగర్లో అర్ధరాత్రి నిర్వహించిన ఆపరేషన్తో ఇది స్పష్టమైంది. ఒక ఐపీఎస్ అధికారికే ఎన్నో ఛేదు అనుభవాలు ఎదురయ్యాయి. గంజాయి బ్యాచ్లు రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నాయి. పాన్ డబ్బాలలోనే మత్తు పదార్థాలు అమ్ముతున్నారనే విషయంపై మహిళా అధికారే ఆందోళన వ్యక్తం చేయడం హైదరాబాద్లో శాంతి భద్రతల డొల్ల తనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
– సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో షీ టీమ్స్ అంటే మహిళలకు ఒక అభయంగా రక్షణగా నిలిచాయి. సింగపూర్ తరహాలో హైదరాబాద్లో మహిళల భద్రతపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల సహకారంతో నేనుసైతం కార్యక్రమంతో సుమారు 9 లక్షల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే సీసీ కెమెరాలు అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. నేడు ఆ సీసీ కెమెరాలు సగానికి సగం పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో షీ టీమ్స్ ఉనికి లేకుండా పోతున్నాయి. నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్కు ప్రతి రోజు 100కుపై ఫిర్యాదులు అందుతున్నాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన కరువైంది.
మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్ నిఘా పెట్టిన రోజులు పూర్తిగా మారిపోయాయి. నేడు షీ టీమ్స్ అంటే భయం లేదు.. షీ టీమ్స్ ఉనికి కన్పించడం లేదు. సోషల్మీడియాలో మహిళలను వేధించే ముఠాలు, మైనర్లను ట్రాప్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న ఘటనలు నేడు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు, మహిళల భద్రత అంతా గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి.