తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 14: నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల కాలంగా జీవో నెం 88కింద నియామకమైన ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది.
ఫలితంగా దవాఖానలో 7 డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 62మంది ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దవాఖాన ఆవరణలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో దవాఖానలో అంబులెన్స్లు నడిపే ఏడుగురు డైవర్లు పూర్తిస్థాయిలో విధులకు దూరంగా ఉంటున్నారు.
దీంతో నిలోఫర్ నుంచి పలు రకాల వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా, సరోజిని, గాంధీ తదితర ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులను, చిన్నారులను తీసుకువెళ్లవలసిన డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ విషయంపై దవాఖాన వర్గాలను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వాస్తవమేనని అంబులెన్స్ల డ్రైవర్లు విధులను బహిష్కరించడం వాస్తవమేనని తెలిపారు. వీరభధ్ర సర్వీసెస్ కాంట్రాక్టర్కు నిధుల విడుదల ఆలస్యం విషయంలో.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.