బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి, పలువురు భంగపడ్డారు. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని సేవ చేస్తున్న తమకు కాదని ప్యారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడంతో ఒక్కొక్కరిగా ఆ పార్టీలను వీడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతల సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతున్నారు. పార్టీలో చేరే వారికి భవిష్యత్తుపై భరోసానిస్తుండటంతో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు పెరిగాయి.
సిటీబ్యూరో/హిమాయత్నగర్, నవంబర్ 3 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాకిస్తున్నారు. పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని ప్యారాచూట్ నేతలకు అవకాశమివ్వడంపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. తాజాగా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ దంపతులు బీఆర్ఎస్లో చేరారు. ఆమె భర్త రామన్ గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారిద్దరూ గులాబీ కండువా కప్పుకున్నారు. మొన్న కూకట్పల్లి నుంచి టికెట్ ఆశించిన బీజేపీ నాయకులు, ఖైరతాబాద్కు చెందిన సీనియర్ నాయకుడు పల్లపు గోవర్ధన్లు కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ను లంకల దీపక్రెడ్డికి కేటాయించడంతో ఆశావహుల్లో అసంతృప్తి రాజుకుంది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన పలువురు సీనియర్ నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.బాలప్రకాశ్, బీజేపీ సెంట్రల్ జిల్లా ఆర్టీఐ కన్వీనర్గా వ్యవహరిస్తున్న కృష్ణకాంత్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నేత శివకుమార్, వైశ్య సేవా సంఘం అధ్యక్షుడు లింగం తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గఎన్నికల ఇన్చార్జి కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు గులాబీ పార్టీలో చేరారు. గ్రేటర్ వ్యాప్తంగా కమలంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సరైన న్యాయం బీఆర్ఎస్లో దొరుకుతుందని భావించిన ఆ నాయకులంతా కారెక్కుతున్నారు. మరోవైపు పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కమలం పెద్దలు డీలా పడుతున్నారు.
బీజేపీలో మూడున్నర దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్న తమను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామ చంద్రా రెడ్డి టార్గెట్ చేసి అణచివేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం రామన్గౌడ్,హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్గౌడ్ ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ అని చూడకుండా అడుగడుగునా అవమానాలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బిడ్డగా తనకు అవకాశం కల్పించాలని పార్టీకి దరఖాస్తు చేసుకుంటే తన పేరును కేంద్ర కమిటీకి పంపించలేదన్నారు. శుక్రవారం నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… బీజేపీలో గత 36 ఏండ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ సేవలు అందిస్తున్నప్పటికీ సరైన ప్రాధాన్యత లేనందునే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశామని, తమ రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డికి పంపించినట్లు తెలిపారు.
గత 10 నెలలుగా తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ, దాడులకు సైతం పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీలో బీసీలను అణగదొక్కి రాజకీయంగా ఎదగనీయకుండా చింతల రామచంద్రారెడ్డి కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ తమను దూరం పెట్టే ప్రయత్నం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీలో పనిచేసే నాయకులు,కార్యకర్తలను అవమానించి బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. చింతల రామచంద్రారెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు, వేధింపుల విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించి చింతలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారంచేసి ఓడిస్తామన్నారు. బీజేపీని నమ్ముకుని ఎన్నో ఏండ్లుగా కష్టపడి పని చేసిన తమపై సోషల్ మీడియా వేదికగా చింతల తన అనుచరులతో ఎన్నో ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని గుర్తించి,ప్రజల అభీష్టం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని స్పష్టం చేశారు.