నగరంలో పలుచోట్ల అక్రమంగా వెలుస్తున్న బహుళఅంతస్తుల భవనాలు అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. టౌన్ప్లానింగ్ ఉన్నా.. లేనట్లే అని చెప్పవచ్చు.. ఇందుకు రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రజావాణిలో 138 ఫిర్యాదులు రాగా.. అందులో 37 ఫిర్యాదులు ఒక్క అక్రమ నిర్మాణానికి సంబంధించినవే కావడం గమనార్హం. టౌన్ ప్లానింగ్ అంటే అక్రమాలకు ప్లానింగ్ ఇచ్చేది వీరేనని పలువురు చెప్పుకుంటున్నారు.
సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : విచ్చల విడిగా అక్రమ, అనధికార, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి జీహెచ్ఎంసీకి అందుతున్న ఫిర్యాదులే నిదర్శనమని చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ ప్రతి సోమవారం సర్కిల్, జోనల్, సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు అందించిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నది. అయితే ఎక్కువ శాతం టౌన్ప్లానింగ్కు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రజావాణిలో 138 ఫిర్యాదులలో 37 ఫిర్యాదులు ఒక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గ్రేటర్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నది అక్షరసత్యం. ఎక్కువ శాతం అసలే అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే .. పర్మిషన్ తీసుకున్నామని చెబుతూనే ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపట్టకుండా.. కనీస మౌలిక వసతులు, పార్కింగ్ సదుపాయం లేకుండా.. సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా కమర్షియల్ భవనాలను కట్టేస్తున్న దాఖలాలు అత్యధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డిమాండ్ కలిగిన ఏరియాలో మాత్రం ఒక్కో అంతస్తుకు రూ.లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న అరోపణలు ఉన్నాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు చెందిన చిన్న చిన్న నిర్మాణాలపై అధికారులు ప్రతాపం చూపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బడా నిర్మాణాల జోలికి వెళ్లపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువ కాలంగా ఒకే చోట తిష్ట వేసిన ఏసీపీలు, టీపీఎస్, చైన్మెన్లను మార్చాలన్న డిమాండ్లు వ్యక్త మవుతున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న నిర్మాణం శేరిలింగంపల్లి జోన్ ప్రశాంత్హిల్స్ కాలనీలోని ప్లాట్ నం.175, 166కు సంబంధించినది.. సదరు భవన నిర్మాణ యాజమాని అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారు. జీ+4 అంతస్తులకు నిర్మాణ అనుమతి తీసుకొని క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు మించి అంతస్తుల మీద అంతస్తులు కడుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని అపై నిర్మాణానికి వెనుకాడడం లేదు.. అదనపు అంతస్తులతో పాటు కనీస సెట్బ్యాక్ నిబంధనలు పాటించడం లేదు.. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు గాయత్రి స్థానిక టౌన్ప్లానింగ్, జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేరుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడితే ఇప్పటికే రెండు సార్లు ఈ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, సదరు యాజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కానీ చర్యలు తీసుకోకపోవడంతో నేటికి యథేచ్చగా నిర్మాణం జోరుగా కొనసాగుతూనే ఉన్నది. ఇది కేవలం మచ్చుతునక మాత్రమే. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటువంటి నిర్మాణాలు కొకొల్లలు అని చెప్పవచ్చు. భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని కమర్షియల్గా నిర్మాణం చేపట్టడం అనవాయితీగా మారుతున్నది. ఇంటి అద్దెలకు డిమాండ్ ఉండడం.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల డిమాండ్ దృష్ట్యా హాస్టల్కు ఇచ్చే వ్యాపారంగా మలుచుకుంటున్నారు. ఐటీ కారిడార్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నదని, లంచం ఇచ్చి అదనపు అంతస్తులు కట్టుకుంటున్నారని కొందరు యాజమానులు బాహాటంగానే చెబుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాల్సిన జోనల్ స్థాయి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను జీహెచ్ఎంసీ నిర్వీర్యం చేసింది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పని చేస్తాయంటూ కేంద్ర కార్యాలయం నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రస్తుతం నామమాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.