బంజారాహిల్స్, ఫిబ్రవరి 1 : మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్న వ్యక్తిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకున్న గొడవలో హోంగార్డు చేతిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అంబర్పేటకు చెందిన మల్లేశ్ (50) కృష్ణనగర్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండు వారాలుగా అతడు ఇంటికి రాకపోవడంతో యజమానికి ఫోన్చేయగా.. విధులకు రావడంలేదని తెలిసింది. దీంతో గతనెల 10న మల్లేశ్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. గత డిసెంబర్ 23న మల్లేశ్ మద్యం మత్తులో కృష్ణానగర్లో హంగామా చేశాడు.
విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్ హోంగార్డు పీరయ్య అక్కడికి వెళ్లగా, వారి మధ్య జరిగిన గొడవలో మల్లేశ్కు గాయాలయ్యాయి. దీంతో అతడిని 108లో గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ జనవరి 1న మృతి చెందాడు. అతడి మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో చిలకలగూడ పోలీసులు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోస్టుమార్టం కూడా చేయించారు. మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు చిలకలగూడ పోలీసుల వద్ద ఉన్న మృతదేహంపై ఆరా తీశారు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా, హోంగార్డు పీరయ్యతో జరిగిన గొడవలో గాయపడి మల్లేశ్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.