సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధలు వాణిజ్య సిలిండర్పై అదనంగా రూ.1,565.50 లు భారం మోపాయి. ఫలితంగా నగరంలో ప్రధానంగా ఆహార రంగం, హాస్టళ్లు, మెస్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్యాటరింగ్లు, చిరుతిండ్ల వ్యాపారాలు చతికలపడ్డాయి.
సిటీ బ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మహానగరంలో 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.52తో మహా నగరంపై రోజుకు అక్షరాలా ముప్పై మూడు లక్షల ఎనభై వేలు (రూ. 33.80 లక్షలు) అదనపు భారం పడుతున్నది. వ్యాపారుల జేబుల నుంచి చమురు సంస్థల ఖాతాల్లోకి చేరిపోతోంది. ఈ లెకన నెలకు నగరం చెల్లించబోయే అదనపు మూల్యం సుమారు రూ. 10.14 కోట్లు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. నగరవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, వీధి వ్యాపారాల అవసరాల కోసం రోజుకు సగటున 65వేల వాణిజ్య సిలిండర్లు వినియోగమవుతున్నాయి. కాగా, ఇది కేవలం హోటళ్లు, వ్యాపారుల పెట్టుబడి విషయంగా కనిపిస్తున్నా దీని అంతిమ ప్రభావం మాత్రం సామాన్యుడి జేబుకే చిల్లుపడుతోంది.
గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్తో..
సామాన్యులు రోడ్లపై ఆరగించే ఒక్క ప్లేట్ మిర్చి ధర రూ. 25 ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ. 35 చేశారు. గప్చుప్ కట్లిట్ రూ. 30 ఉండగా రూ.50కి పెంచారు. మరోవైపు మెస్ భోజనం రూ. 90 ఉండగా రూ.140 చేశారు. ఇంకోవైపు ప్లేట్ ఇడ్లి రూ. 40 ఉండగా, రూ.60 చేశారు. హాస్టళ్లలో సైతం నెలకు రూ.4000 ఉన్న ఫీజు రూ. 5,200 పెంచారు. ఇలా అనేక రకాలుగా ధరలు వారి పాత ధరలకు 10-30 శాతం వరకు పెంచారు. మరోవైపు ఇదే అదునుగా గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్తో డబ్బులు దండుకుంటున్నారు. ఒక్క సిలిండర్పై అదనంగా 2వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
ధరలు పెంపు.. కస్టమర్లపై భారం..!
నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతుండగా, ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర రూ. 3,365 పలకడం వ్యాపారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా హోటల్ నిర్వాహకులు, కేటరింగ్ వ్యాపారులు నిర్వహణ వ్యయాన్ని భరించలేక దికుతోచని స్థితిలో పడ్డారు. ధరలు పెంచితే గిరాకీ రాదనే భయం, పెంచకపోతే పెట్టుబడి కూడా సమకూరదని ఆందోళన చెందుతున్నారు. లాభాల పూర్తిగా పడిపోవడంతో నగరంలోని కొన్ని చిన్న టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. నేరుగా వాణిజ్య సిలిండర్లను సామాన్యులు వాడకపోయినప్పటికీ దీని ప్రభావం పరోక్షంగా వారి జేబులపైనే పడుతున్నది. హోటళ్లలో చాయ్, టిఫిన్, భోజనం ధరలతో పాటు బేకరీ ఐటమ్స్, వీధి వ్యాపారాల ధరలు 10 నుంచి 30 శాతం పెరిగాయి. నిరుద్యోగుల తిప్పలు..!
ఉద్యోగాల సన్నద్ధతకు ఊళ్ల నుంచి నగరానికి వచ్చిన వారిపై కమర్షియల్ గ్యాస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. కోచింగ్ సెంటర్లు, ఐటీ కారిడార్లలో ఉద్యోగాల కోసం రూమ్లు, హాస్టళ్లలో ఉండే లక్షలాది మంది యువత భవిష్యత్ ఆందోళనలో పడినట్టు అయింది. ప్రైవేటు హాస్టల్ నిర్వాహకులు, మెస్ యజమానులు వాణిజ్య సిలిండర్ల ధర పెరిగిన ప్రతిసారీ మెనూ క్వాలిటీ తగ్గిస్తున్నారు. చికడపల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అమీర్పేట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉండే నిరుద్యోగులు మెస్ చార్జీలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు.
చతికిలపడ్డ చిరు వ్యాపారాలు..!
ఆటో డ్రైవర్లు, కూలీలు, చిన్నపాటి ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు అత్యధికంగా తక్కువ ధరల్లో లభించే రోడ్ సైడ్ ఫుడ్పై ఆధారపడుతుంటారు. ఇడ్లీ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. కమర్షియల్ సిలిండర్ రేటు పెరగడంతో చిన్న వ్యాపారులు వాటిని నడపలేక సతమతమవుతున్నారు. ధరలు పెంచితే గిరాకీ రాదు.. పెంచకపోతే పెట్టుబడి రాదనే కారణంతో వారు ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్టు సికింద్రాబాద్కు చెందిన ఓ ఇడ్లి బండి వ్యాపారి రాజు తెలిపాడు. ఇదివరకు 30లకు నాలుగు ఇడ్లీలు ఇస్తే, ఇప్పుడు అదే ధర ఉంచి మూడు ఇడ్లీలకు పరిమితం చేసి చట్నీ, సాంబార్ తగ్గించారని కస్టమర్ నరేందర్ తెలిపాడు.

చిన్న తరహా వ్యాపారాలకు చాలా కష్టం
గ్యాస్ధరలు ధర పెరుగుదలతో వ్యాపారాలు నడవడం కష్టంగా ఉంది. మా సెంటర్కు చాలా మంది నిరుద్యోగులు వస్తుంటారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో చాలా మంది ఇంటి దారి పడుతున్నారు. టీ, టిఫిన్ ధరలు పెరగడంతో గిరాకీ తగ్గింది. దీంతో టీ ధరలు పెంచలేకపోతున్నాం. లాభం లేకున్నా టీ బండి నడుపాల్సి వస్తున్నది. ప్రభుత్వం స్పందించి గ్యాస్ ధరలు తగ్గించేలా కృషి చేయాలి.
– మోహన్, టీ సెంటర్ నిర్వాహకుడు
సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ..

మన్సూరాబాద్, జూన్ 7: కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగం 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 29 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు ఆదివారం ఎల్బీనగర్ రింగ్రోడ్డులో కట్టెల పొయ్యిపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కొసనం ధనలక్ష్మి, సూరజ్ యజ్ధాని, రంగేశ్వరి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.