హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమష్టిగా సరైన వ్యూహరచన చేయాలని, ఇందుకు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూచించారు. ఫాసిస్టు శక్తుల భారతీయ రూపమే బీజేపీ అని విమర్శించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగితే దేశంలో వినాశనం తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో సోమవారం రాజా మీడియాతో మాట్లాడారు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పరిరక్షించేందుకు 2024లో బీజేపీని ఓడించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది తెలంగాణ, తమిళనాడు, త్రిపుర తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇందుకు సీపీఐ తన వంతుగా ఇతర పార్టీలతో చర్చించి ఉమ్మడి వ్యూహరచన కోసం కృషి చేస్తుందని వెల్లడించారు. జమిలి ఎన్నికలకు సీపీఐ వ్యతిరేకమని చెప్పారు.
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన రెండో తీర్పులో ప్రాథమిక అంశాలను లేవనెత్తారని, ప్రజలు దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. రాష్ర్టాలలో గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్న అంశంపై చర్చ జరగాలని సూచించారు. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ వర్ధంతి సందర్భంగా సీపీఐ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఎన్ బాల మల్లేశ్, కలవేన శంకర్, తకల్లపల్లి శ్రీనివాసరావు, బాలనర్సింహ పాల్గొన్నారు.