సిటీబ్యూరో: ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు(స్కైవే) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శనివారాల్లో సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఒక స్కైవేను జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, మరో స్కైవేను ప్యారడైజ్ నుంచి మేడ్చల్-కండ్లకోయ వెళ్లే మార్గంలో నిర్మించనున్నారు. నగరం నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక శైలిలో వీటిని నిర్మించేందుకు హెచ్ఎండీఏ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
రెండు స్కైవేలను నిర్మించే మార్గాల్లో రక్షణ శాఖ భూములు పెద్ద మొత్తంలో సేకరించాల్సి ఉండటంతో కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఇందుకోసం గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఆ ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే రక్షణ శాఖ భూములను అప్పగించేందుకు అంగీకరించడంతో రెండు స్కైవేలను నిర్మించేందుకు మార్గం సుగమమైంది. రాజీవ్ రహదారిపై నిర్మించే స్కైవేను 11.3 కి.మీ పొడవు, 6 లేన్ల వెడల్పుతో నిర్మించనున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.