మహానగరాభివృద్ధికి ‘వ్యూహాత్మక’ అడుగులు ఫలితాలిస్తున్నాయి. ఏండ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలతో సతమతవుతున్న పౌరులకు ఉపశమనం కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం’ (ఎస్ఆర్డీపీ) ప్రారంభించింది. ప్రధాన జంక్షన్ల వద్ద వెతలు తీర్చేందుకు ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణంతో పాటు రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. మొత్తం 42 పనులకు శ్రీకారం చుట్టగా.. ఎన్నికలకు ముందే 33 పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా చేట్టిన 34వ ఫ్లైఓవర్ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Hyderabad | ఎల్బీనగర్, మార్చి 8 : గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం అవిష్కృతం కానున్నది. ఎస్ఆర్డీపీ ( స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)లో భాగంగా బైరామల్గూడలో రెండవ లేవల్ ఫ్లై ఓవర్తో పాటు లూప్ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ మహానగరంలో రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ సంకల్పంతో రూపుదిద్దుకున్న ఎస్ఆర్డీపీ పనుల్లో మరో ముందడుగు పడింది. ఎల్బీనగర్లో ఇప్పటికే ఎల్బీనగర్, బైరామల్గూడ, కామినేని, నాగోలు ప్రాంతాల్లో ైప్లె ఓవర్లు పూర్తికాగా.. చింతలకుంట, ఎల్బీనగర్లో అండర్పాస్లు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ రద్దీ దాదాపుగా తీరిపోయింది. అయితే ఇన్నర్ రింగ్రోడ్డు నుంచి సాగర్ రోడ్డుతో పాటుగా చింతలకుంట అండర్పాస్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిని కలిపే విధంగా వై ఆకారంలో నిర్మించిన రెండవ లేవల్ ఫ్లై ఓవర్ పనులు పూర్తికాగా ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఫ్లై ఓవర్తో పాటుగా బైరామల్గూడ లూప్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా 42 పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో ప్రస్తుతం బైరామల్గూడ రెండవ లేవల్ ఫ్లైఓవర్ 34వది. గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో యుద్ధ ప్రాతిపదికన ఈ ఫ్లై ఓవర్లకు శ్రీకారం చుట్టారు. మిగిలిన ైప్లె ఓవర్లను కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ రెండవ లేవల్ ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ఇన్నర్ రింగ్రోడ్డుతో పాటుగా సాగర్ రోడ్డు, చింతలకుంట వైపు మార్గాల్లో ట్రాఫిక్ చిక్కులకు పూర్తిగా పరిష్కారం లభించనున్నది.
బైరామల్గూడ జంక్షన్లో రెండవ లేవల్ ఫ్లై ఓవర్, కుడివైపు లూప్ ఫ్లై ఓవర్ నిర్మాణం రూ.148.05 కోట్లతో చేపట్టారు. మొత్తం పొడవు 1786.60 మీటర్లు చేపట్టారు. వయాడక్ట్ భాగం పొడువు 1305.60 మీటర్లు, ర్యాంపుల పొడువు 481 మీటర్లు ఉంది. ఫ్లై ఓవర్ ఒక వైపు ర్యాంపు ఎ -143 మీటర్లు, చింతలకుంట వైపు ర్యాపు-బి 212 మీటర్లు , నాగార్జున సాగర్ రోడ్డు వైపు ర్యాంపు- సీ 126 మీటర్లు ఉంది. ఒవైసీ వైపు 12 మీటర్ల వెడల్పు , 11 మీటర్ల క్యారేజ్ వే, 3 లేన్ వన్ వే ఉండగా, నాగార్జున సాగర్ వైపు 8.5 మీటర్ల వెడల్పు 7.5 మీటర్ల క్యారేజ్ వే, 2 లేన్ వన్వే, చింతల కుంట వైపు 8.5 మీటర్ల వెడల్పు, 7.5 మీటర్ల క్యారేజ్ వే, 2 లేన్ వన్వే తో ఫ్లై ఓవర్ నిర్మించారు.
బైరామల్గూడ జంక్షన్లో రెండవ లేవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో దక్షిణ, తూర్పు హైదరాబాద్ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్డు నుంచి సికింద్రాబాద్ ప్రాంతంతో పాటుగా నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు కూడా మెరుగైన సదుపాయం కలుగుతుంది.
సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో మురుగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్టీపీ (సీవరేజీ ట్రిట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్యాకేజీల్లో మొత్తం రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 కొత్త ఎస్టీపీలను నిర్మించతలపెట్టగా.. వీటి నిర్మాణ బాధ్యతను జలమండలి చూస్తున్నది. ఐదు సర్కిళ్లలో ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఈ కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది.
31 ఎస్టీపీల్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందే కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులన్ని తుది దశకు చేరగా, నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ట్రయల్ రన్ పనులు విజయవంతం చేసుకున్న నల్లచెరువు, పెద్ద చెరువు ఎస్టీపీలను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. శనివారం సీఎం రేవంత్రెడ్డి ఈ రెండు ఎస్టీపీలను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుబాటులోకి వస్తే రోజు ఉత్పన్నమయ్యే మురుగును 100శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుంది. కాగా ప్రస్తుతం గ్రేటర్లో ప్రతి రోజు 1950 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పన్నమవుతున్నది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీ, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీ నీటిని (46శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం.
హైదరాబాద్ నగరంలో సీవరేజీ మాస్టర్ప్లాన్, ఎస్టీపీల ప్రాజెక్టు ఫ్యాకేజీ-1లో భాగంగా నల్లచెరువు ఎస్టీపీని నిర్మించారు.
ప్రయోజనం పొందే ప్రాంతాలు :- నాచారం, కంటోన్మెంట్, కాప్రా, బాబానగర్, ఈఎస్ఐ, హెచ్ఎంటీ, హైకోర్టు కాలనీ, సేశాయి నగర్, ద్వారకా నగర్, కమలానగర్, పాత స్వరూప్నగర్, ఓల్డ్ రామంతాపూర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్, అజాద్ నగర్, కల్యాణ్ నగర్, కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ, మినీ శిల్పారామం, ఉప్పల్ భగాయత్, ఆదిత్య హాస్పిటల్, రామంతాపూర్, ఐడీఐ ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, మోడర్న్ బేకరీ రోడ్డు, ఉప్పల్, హబ్సిగూడ, శ్రీనివాస్ కాలనీ, విజయపురి కాలనీ
కలిగే ప్రయోజనాలు.. :- ఎస్టీపీ పరిధిలోని ప్రాంతంలో మురుగునీరు శుద్ధి అవుతుంది. క్యాచ్మెంట్ ఏరియాలోకి సీవరేజీ నీరు ప్రవాహం తగ్గుతుంది. శుద్ధి చేసిన నీటిని చెరువులు, కుంటల్లోకి విడుదల చేయడం వల్ల అవి కాలుష్యం కావు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాలు, గార్డెనింగ్ లాంటి మానవేతర అవసరాలకు వాడుకోవచ్చు.
నాచారం, తార్నాక, మల్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి నాలా ద్వారా వచ్చే మురుగు నీరు శుద్ధి అవుతుంది. గౌతంనగర్, లాలాగూడ, దయానంద్నగర్, సంజీవ్నగర్, తార్నాక, హబ్సిగూడ, శ్రీనివాస కాలనీ, చిలుకానగర్ తదితర ప్రాంతాలకు మురుగునీటి సమస్య తీరనున్నది.