భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనతికాలంలోనే పాలనలో ప్రత్యేకతను చాటి దేశానికి తెలంగాణ మోడల్ను చూపిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో దేశంలో గుణాత్మక మార్పే లక్ష్యంగా సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం తీర్మానాలపై అంశాల వారీగా చర్చించారు.