‘ఎన్నికలు రాగానే ఆగం కాకుండా.. రాయేదో రత్నమేదో గుర్తించాలి.. ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2018లో హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండ విజయాన్ని సాధించామని, ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టామని చెప్పారు.
14 ఏండ్లు ఐక్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అనేక రంగాల్లో నంబర్వన్గా నిలిపామన్నారు. రైతులకు ఉచిత కరెంటు, సాగునీరివ్వడం వల్ల కంటి నిండా నిద్ర పోతున్నారని, కడుపునిండా తిండి తింటున్నారని, కల్లాల నుంచే పంటను అమ్ముకొని ఆర్థికంగా నిలబడుతున్నారన్నారు. ఓటు అనేది ప్రజల తలరాతను, రాష్ట్ర భవిష్యత్ను ప్రభావితం చేస్తుందని, స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.