‘శివకుమార్ అని కర్నాటక ఉపముఖ్యమంత్రి ఒకాయన ఉన్నడు. ఆయన తెలంగాణకొచ్చి ఏమంటున్నడు ? కేసీఆర్.. నీకు తెలుసా ? కావాలంటే వచ్చి చూడు… మేం రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి.. మేం 24 గంటల కరెంటు ఇస్తున్నంరా నాయనా అని నేను చెప్పిన. కాంగ్రెస్కు ఓటు వేస్తే కర్నాటకలో ప్రజల గతి ఏమైంది ? ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే మనకు కూడా కర్నాటకలాగ పవర్ కట్ల గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు మాణిక్రావు, మహిపాల్రెడ్డిలకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పటాన్చెరు పారిశ్రామిక వేత్తలు, కార్మికులు ఆలోచించాలె.. కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు ఎట్లుండె… ఇప్పుడు ఎట్లున్నది ? కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కటకటలు. పరిశ్రమలకు పవర్ హాలీడేలు. రాష్ట్రమంతా రైతు ఆత్మహత్యలు, చేనేతల ఆకలిచావులు, బతుకపోయిన వలసబిడ్డలు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటు వల్ల రెండు షిఫ్టుల్లో పని చేసుకుంటున్నాం.
ఉత్పత్తి పెరిగి యజమానులు లాభపడుతున్నరు.. డబుల్ డ్యూటీలతో కార్మికులు పది రూపాయాలు సంపాదించుకుంటున్నరు.. ఇది ఇంకా పెరుగుతది.. ఎవరు ఆపినా ఆగదు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ రాజ్యంలో పరిశ్రమల కాలుష్యం వల్ల ఎన్ని జబ్బులు వచ్చేవి. ఈ రోజు సొంత రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం.. కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఐదారు రోజుల టైమ్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఈ విషయాలపై చర్చ జరిగితే.. క్యూ కట్టి మరి కారు గుర్తుకు ఓట్లు గుద్దుతరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.