ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించి, వైద్య వ్యవస్థను బాగు చేసి.. మన్యం మంచంపట్టే సమస్య లేకుండా చేశామన్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశామని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు వార్దా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు, ఆసిఫాబాద్కు ఐటీఐ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నామన్నారు.
నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47వేల ఎకరాల భూమిపై గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నామని, ఈ సీజన్ నుంచే రైతుబంధు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆదివాసి, గిరిజన బిడ్డలపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పారు.
కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ.25 కోట్లు ముఖ్యమంత్రి నిధుల నుంచి మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. 335 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ.10 లక్షలు ప్రకటించారు. ప్రజలే దేవుళ్లుగా భావించి సేవ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లోనూ మనమే గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీరు చూపించిన ప్రేమే ఇందుకు నిదర్శనమని అన్నారు.