తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మంగళవారం నాగర్ కర్నూల్ సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. సీఎం వెంట మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.