సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) ; మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందులో డౌట్ లేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి వనమా వెంకటేశ్వర్రావుకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా..? కమిట్మెంట్తో పనిచేసినం.. విద్య, వైద్యం, రవాణారంగం, తాగు, సాగునీటి రంగం, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించాం. గతంలో జరిగిన అభివృద్ధి.. ఇప్పుడు జరిగిన అభివృద్ధిని బేరీజు చేయాలి. కొత్తగూడెం జిల్లాలో 16,769 ఎకరాల పొడు భూమి పట్టాలను 4500 గిరిజన కుటుంబాలకు అందజేశాం. రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే.. పాత ఖమ్మం బంగారు తునకలా తయారైతది. 50 ఏండ్లలో కాంగ్రెస్ పాలనలో కాని పనులు చేసినం. అమ్మపేరు.. బొమ్మపేరు చెప్పి.. తరతరాల నుంచి దళితులను అణచివేత, వివక్షకు గురిచేశారు. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకువస్తే.. ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు. ఉద్యోగ సోదరులకు మనవి చేస్తున్నా.. మీరందరూ గత ప్రభుత్వాలను చూశారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఎలా వెళ్తున్నామో తెలుసు. దేశంలోనే తొలిసారిగా పీఆర్సీ ఇస్తే.. దాంతో సమానంగా జీతాలు పెంచింది చూశారు. అభివృద్ధి చేసేటోళ్లకు కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే మీకే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటయ్. తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణ ఎలా మారిందో మీ కండ్లముందే ఉన్నది. వీటన్నింటిపై ఆలోచించి.. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయండి. అని కేసీఆర్ అన్నారు.
యువకులు సింగరేణి చరిత్ర తెలుసుకోవాలి. 134 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి వంద శాంతం తెలంగాణ సొత్తు. సమైక్య రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏడ్లు అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేంద్రానికి 49శాతం వాటా వెళ్లింది. సమైక్య రాష్ట్రంలో సింగరేణి టర్నోవర్ రూ.11వేల కోట్లు ఉంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.33వేల కోట్లకు తీసుకుపోయినం. నూతన నియామకాలతో సింగరేణి యువ కార్మికులతో కళకళలాడుతున్నది. 22వేల మందికి ఇండ్ల స్థలాలు అందజేశాం. ఆనాడు
డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంకనే పునరుద్ధరించాం. 15,256 మందికి ఉద్యోగాలిచ్చాం. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే నాడు రూ.లక్ష ఇచ్చేది.. ఇప్పుడు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటున్నాం. దసరా కానుకగా.. ఆనాడు కాంగ్రెస్ రూ.70 కోట్లు కార్మికులకు పంచితే.. నేడు రూ.700 కోట్లు కార్మికులకు పంచినం.
ఢిల్లీ గులామ్ల కింద ఉండి..
మనం కూడా గులామ్ అవుదామా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడైనా తెలంగాణ జెండా ఎత్తినయా..? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజానికి ఎత్తుకున్నయా..? మనం ఎత్తుకున్నప్పుడు మనల్ని అవమానించారు.. కాల్చి చంపారు.. జైళ్లలో పెట్టారు.. అలాంటోళ్లకు తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటది.
ఈ రోజు ఖమ్మం గడ్డపై చెబుతున్నా.. రాబోయే యుగం ప్రాంతీయ పార్టీలదే. ఎక్కడివారు అక్కడ ఉంటేనే.. ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..