సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సనత్నగర్, అంబర్పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కలెక్టర్, ఆయా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పర్యటించి కులవృత్తులకు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. బీసీ బంధు నిరంతర కార్యక్రమమని, అర్హులందరికీ దశల వారీగా ఆర్థిక సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతగా ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి, ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్ / కవాడిగూడ / కాచిగూడ / బేగంపేట్, ఆగస్టు 23 : కులవృత్తులను కాపాడటంతో పాటు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష ఆర్థిక సహాయం చెక్కులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. అలాగే వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు కలెక్టర్ అనుదీప్తో కలిసి మంత్రి తలసాని చెక్కులను అందజేశారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ తుల్జాభవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ 295 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్హాలులో 3 వందల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి మంత్రి తలసాని చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో బస్తీల రూపురేఖలు మారాయన్నారు. నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్న కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు అధికారంలో ఉండి ఏమి వెలగబెట్టిందని మంత్రి దుయ్యబట్టారు.
కేంద్రంలో 9 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ఆయా పార్టీలు చేసే దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అంద జేసిన ఈ ఆర్థిక సహాయంతో వృద్ధిలోకి రావాలని సూచించారు. నియోజకవర్గంలో రూ.3 కోట్ల ఆర్థిక సహాయాన్ని బీసీ కులవృత్తి దారులకు అందజేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, బీసీ కార్పొరేషన్ అధికారి ఆశన్న, కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదీప్య రావు, సంగీత యాదవ్, తదితరులు పాల్గొన్నారు.