ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. విమానాశ్రయం, ఓడరేవులు, రైళ్లు ఇలా చివరకు దేశాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి అగుపిస్తున్నది. నన్ను కూడా బెదిరించాడు. మీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఏడాదికి రూ.5వేల కోట్ల బడ్జెట్ను కట్ చేస్తామని.. అయినా వెనక్కి తగ్గలే.. తల తెగిపడ్డా సరే.. మీటర్లు పెట్టనని చెప్పాను. నేను ఒక రైతునే.. రైతుల బాధలు తెలుసుకు కాబట్టే.. నేను ఒప్పుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేధావులను పిలిచి.. చర్చలు జరిపి ఒకదారి వేసుకున్నాం. ఈ మధ్యనే మొఖాలు తెల్లబడుతున్నాయ్. గతంలో పిల్లనివ్వాలంటే అటెండర్ ఉద్యోగం ఉన్నా సరేగాని.., వ్యవసాయం చేస్తే పిల్లనివ్వమనేవారు.. నేడు పరిస్థితి మారింది. భూమి ఉంటేనే పిల్లను ఇస్తున్నరు.
ఆరు నూరైనా.. గెలువబోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఎవ్వడూ ఆపలేడు.. ఆపడం ఎవడి తాత, జేజమ్మ వశం కాదు. దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో..? కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? దళిత బంధు పెట్టమని ఎవరన్నా అడిగారా.? ఎవడన్న ఈ మొగోళ్లు ధర్నా చేసిండ్రా.. దరఖాస్తు పెట్టిండ్రా..? మరి ఎవడు పెట్టిండు.. ఎందుకు పెట్టాము.. దయచేసి ఆలోచన చేయాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బుధవారం సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య, ఇల్లెందు నియోజకవర్గంలో హరిప్రియ నాయక్కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసం ఎరుకనా..? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు. కాంగ్రెస్ మీకు హింట్ ఇస్తుంది.. గొడ్డలి భుజం మీదనున్నది.. బట్ట కప్పారు గంతే.. పట్టుదప్పి కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీమ్.. కరెంటు కాటకలుస్తుంది. ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చ పచ్చ జెండాలు.. దశాబ్దాలుగా ఏం చేశారో ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు.. పార్టీల మధ్య పోరాటం.. గత దశాబ్దాలుగా ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు.. పదేళ్లకు ముందు రాష్ట్రం ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు మంచి హృదయంతో ఆలోచన చేసి ఓటు వేయాలి. మన అమూల్యమైన ఓటు సన్నాసికి వేస్తున్నామా..? సరైన వ్యక్తికి వేస్తున్నామా.? అని ఆలోచన చేయాలి.. అని కేసీఆర్ అన్నారు. ”