సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రెండు తీపి కబుర్లు చెప్పడంతో మంగళవారం మహానగరంలో సంబురాలు మిన్నంటాయి. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. ఎన్నడూ ఊహించని విధంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుండడంతో సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
మరో వైపు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్న నగరావాసులను విముక్తి చేసేలా.. నగరం నలువైపులా మెట్రో విస్తరణ చేస్తుండడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేవు. నగరంలో ఎటు నుంచి ఎటైనా వెళ్లేలా రూ. 69,100 కోట్లతో 415 కిలోమీటర్లు మెట్రో విస్తరణ జరుగనున్నది. ప్రజారవాణాను మెరుగుపెరిచే గొప్ప నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతనిధులు, ఉద్యోగులు, ప్రజలు క్షీరాభిషేకాలు చేశారు.
కలలోనైనా.. కలగనలేదు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. నిన్నటివరకు ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయో అని ఆందోళనలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని కబురు అందించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పలు స్కీముల ద్వారా లాభాల బాట పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ప్రజా రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ ప్రకటిస్తే చాలనుకుంటున్న డ్రైవరన్నలు.. కండక్టర్ల ఆశలకు మించిన ఆఫర్ ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆనందంలో మునిగిపోయారు. మంగళవారం నగర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పటాకులు పేల్చి., స్వీట్లు పంచిపెట్టారు. తాము ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారామని, తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని, కుటుంబాలకు భరోసా దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తమను తలెత్తుకొని తిరిగేలా చేసిన ముఖ్యమంత్రిని ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు నిర్వహించిన సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఉద్యోగులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
యూసుఫ్గూడ కూడలి వద్ద డ్రైవరన్నకు స్వీట్ తినిపిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
మియాపూర్ డిపోలో కార్మికులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్
రాంనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కాచిగూడ ఆర్టీసీ డిపోలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ డిపో కార్మికులు