వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 29: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పీవీ నరసింహా రావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో నూతనంగా రూ.12.75 కోట్లతో నిర్మించిన వెటర్నరీ క్లినిక్ భవన సముదాయాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ఉమ్మడి పాలనలో మూగ జీవాల గోస ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడ్డాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూగ జీవాలకు సేవ చేయడం సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు , అనుబంధ రంగాలపై దృష్టి సారించారని తెలిపారు.
పశుసంపదలో మనమే మేటి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహా రావు పేరుతో వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనతి కాలంలోనే యూనివర్సిటీలో వేలాది మంది పశువైద్యులను తీర్చిదిద్దారని చెప్పారు. కొత్తగా నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లోమెడిసిన్, గైనకాలజీ, డయాగ్నసిస్ ల్యాబ్, స్మార్ట్క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో ఉన్నాయని వివరించారు. త్వరలోనే ఎండోస్కోపీ, స్కానింగ్, బ్లడ్బ్యాంక్ అందుబాటులోకి రానుందన్నారు. ఇతర రాష్ర్టాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వెటర్నరీ క్లినిక్ క్లాంపెక్స్లో అన్ని రకాల పశువులు, చిన్నజీవాలు, పెట్స్ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పశువైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, జీవాల పెంపకం దారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్వరలో సిద్దిపేట, నిజామాబాద్ ,నల్గొండలో వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భవన సముదాయ ప్రారంభానికి వచ్చిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తన గురువులు శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, మిత్రుడు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ తదితరులను కలుసుకోవడం తనకు సంతోషంగా ఉన్నదన్నారు. మూగ జీవాల పెంపకం మంచి ఆదాయంతో పాటు ప్రకృతి ఆహ్లాదంతో ఆయుష్షు పెరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, డెయిరీ చైర్మన్ సోమ భరత్ కుమార్, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి , ప్రధాన కార్యదర్శి ఆదార్సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, వీసీ రవీందర్ రెడ్డి, రిజిస్ట్రార్ వీరోజీరావు, చిన్ని ప్రీథమ్,అసోసియేట్ డీన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.