ధాన్యం నింపడంలో బిజీబిజీ
మూడు నెలల పాటు జిల్లాలోనే ఉపాధి
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 25 : నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం, మక్క పంటలు చేతికి రావడంతో బిహార్ కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. 15 రోజుల క్రితం జిల్లాలో మక్క కోతలు, ఇప్పుడు వరి కోతలు ప్రారంభమవుతుండడంతో ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. ఈసారి సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కూలీల కొరతపై ఆందోళనలో ఉన్నప్పటికీ బిహార్ నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు నిర్మల్ జిల్లాకు తరలివచ్చి ఇక్కడే పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో 80 వేల హెక్టార్లలో మక్కజొన్న సాగు కాగా.. ఇప్పటికే 80శాతం మక్కలు బయట మార్కెట్లో రైతులు విక్రయించారు. పంట చేలలోనే దళారులు మక్క కొనుగోళ్లు చేపడుతుండడంతో బిహార్ కూలీలు అక్కడికి వెళ్లి పంటను గన్నీ బ్యాగుల్లో నింపడం, తూకం వేయడం, లారీలో లోడింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. జిల్లాలో రెండువేల మందికి పైగా బిహార్ కూలీలు నిర్మల్, సోన్, మామడ, కుంటాల, భైంసా, దిలావర్పూర్, సారంగాపూర్, కడెం, ఖానాపూర్ మండలాల్లో పని చేస్తున్నారు.
వీరంతా పది మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధాన్యాన్ని తూకం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. క్వింటాలుకు రూ.30 కూలి కింద వీరంతా పని చేస్తున్నారు. ఇప్పుడు వరి కోతలు ప్రారంభం కావడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిరావడంతో కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం జిల్లాలో 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 8 చోట్ల ప్రారంభమయ్యాయి. దీంతో కూలీలందరూ ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజూ పనులకు వెళ్తున్నారు. మరో నెల రోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు ఉండే అవకాశం ఉండడంతో అప్పటివరకు తమకు ఉపాధి లభిస్తుందని బిహార్ కూలీలు పేర్కొంటున్నారు.
కరోనా ఉన్నా కష్టాలేవు..
వరి ధాన్యం పండించిన రైతాంగానికి ప్రభుత్వం పూర్తి భరోసానిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా మద్దతు ధరనూ చెల్లిస్తున్నది. దీంతో వరి ధాన్యం పండించిన రైతన్నకు పూర్తి భరోసా ఏర్పడుతున్నది. ఏ గ్రేడ్ రకానికి రూ.1870, బి గ్రేడ్ రకానికి రూ. 1850 చెల్లిస్తుండడంతో రైతులు వరి పంటను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పలుగా పోసుకున్నారు. ప్రతిరోజూ తూకం వేయడం, వేసిన ధాన్యాన్ని సంచుల్లో నింపి రైస్మిల్లులకు తరలించడానికి అవసరమైన కూలీలు బిహార్ రాష్ట్ర కూలీలు అందుబాటులో ఉండడంతో స్థానిక కూలీల కొరత లేకుండా పనులను నిర్వహించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.