సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలతో కలిసి 4.64 లక్షల మట్టి విగ్రహాలను అన్ని వార్డు కార్యాలయాల ఆవరణలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్లో 66,500, చార్మినార్ జోన్లో 93,600, ఖైరతాబాద్ జోన్లో 80,100, శేరిలింగంపల్లి జోన్లో 42,900, కూకట్పల్లి జోన్లో 58,600, సికింద్రాబాద్ జోన్లో 76,500 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా హెచ్ఎండీఏ ద్వారా 79,200, పీసీబీ ద్వారా 75,000, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 46వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ కోటేశ్వర రావు, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజా తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ..
పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలను తయారు చేయించిన హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నది. శుక్రవారం నగరంలో 20 చోట్ల 20వేల విగ్రహాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో హెచ్ఎండీఏ ఈఈ అప్పారావు హైకోర్టు ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్తో పాటు పలు చోట్ల వేలాది మంది మట్టి విగ్రహాలను తీసుకొని పూజించేందుకు ముందుకు వచ్చారని, ప్రతి ఏటా లక్ష మట్టి విగ్రహాల పంపిణీలో భాగంగా ఈ ఏడాది లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మట్టివిగ్రహాలనే ప్రతిష్టించి పూజలు నిర్వహించేలా అవగాహన కల్పించారు.