హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రివేళ్లల్లో పోలీసులను విధుల్లో ఉంచుతామని కమిషనర్ తెలిపారు.
జీహెచ్ఎంసీతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వరదలతో చెరువులు నిండి ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిందని తెలిపారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.