ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఓపెన్
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి సౌకర్యార్థం నిర్ణయం
ప్రాంగణాల్లో రూ.5కే అన్నపూర్ణ భోజనం
త్వరలో భోజన కేంద్రాల ప్రారంభానికి చర్యలు
20 లైబ్రరీల్లో అన్ని రకాల స్టడీ మెటీరియల్
సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలుకావడం.. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చిన్నచిన్న గదుల్లో ఉంటూ చదువుకోవడం అసౌకర్యంగా ఉంటుండడంతో అనేకమంది ప్రభుత్వ గ్రంథాలయాల్లో అభ్యసిస్తున్నారు. వీరికోసం హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా 20 ప్రధాన గ్రంథాలయాల్లో అన్ని రకాల పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయాల పనివేళలను కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పొడిగించినట్లు పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. వీటి ప్రాంగణాల్లో రూ.5కే కమ్మని భోజనం పెట్టేలా అన్నపూర్ణ కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని బుధవారం జరిగిన సమీక్షలో తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధిపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, నగర చైర్మన్ ప్రసన్న, గ్రంథాలయ సెక్రటరీ పద్మజ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని వివరించారు. ప్రతి గ్రంథాలయంలో అన్ని రకాల పేపర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచామని, దీంతో అనేకమంది గ్రంథాలయాలకు వెళ్లి స్టడీ మెటీరియల్ను వినియోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రధానంగా 20 గ్రంథాలయాల్లో అన్ని రకాల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయని, ఆ గ్రంథాలయాలు మాత్రమే ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు పనిచేస్తాయని వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రంథాలయాల వద్ద అవసరం మేరకు రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న నాలుగు నెలల్లో గ్రంథాలయాల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారనున్నాయని చెప్పారు. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 82 గ్రంథాలయాలు ఉండగా, వాటిలో కొన్ని భవనాల అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ షఫీ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.