నాంపల్లి కోర్టులు, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులందరినీ చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ సమయంలో నిందితుల నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా నకిలీ పాస్పోర్టులపై విదేశాలకు వెళ్లినవారి వివరాలను కూడా సేకరించారు. పాస్పోర్టులు ఇప్పించడంలో స్పెషల్ బ్రాంచ్కు చెందిన అధికారుల హస్తం కూడా ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని గుర్తించారు. నకిలీపాస్ పోర్టులను రద్దుచేయాలని కోరుతూ ఇప్పటికే ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి సీఐడీ అధికారులు లేఖ రాశారు.
దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేస్తూ.. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. చెన్నైకి ఏజెంట్ మురళీధరన్, హైదరాబాద్కు చెంది న సత్తార్ నకిలీ పత్రాలు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారని, వీరిద్దరూ ప్రధాన నిందితులు కావడంతో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించారు. నకిలీ పాస్పోర్టు రాకెట్ను గుర్తించేందుకు సీఐడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 92 అక్రమ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురిని కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మ రం చేసింది. నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని సీఐడీ అధికారులు చెబుతున్నారు.