సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు.. పాటించకపోతే జీవితాలు చెల్లాచెదురవుతాయి. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి విషయాలపై చిన్నారులకు ట్రాక్స్ఎస్ సొసైటీ సంస్థ రైడ్ టూ సేఫ్టీ పేరుతో సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాహనాలతో వేగంగా దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విధానాలపై సభ్యులు అప్రమత్తం చేస్తున్నారు. బైకులు నడిపేటప్పుడు, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం కల్పిస్తున్నారు. రాజధాని రహదారులపై ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా బైక్ రేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయొద్దంటూ విద్యాసంస్థలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలోని 86 స్కూల్స్లో విద్యార్థులకు వర్క్షాపులు నిర్వహించారు. 10,500 హెల్మెట్స్ను ఉచితంగా పంపిణీ చేశారు.
రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడపడం, ద్విచక్ర వాహనదారులు గల్లీల్లో దూసుకెళ్లడం.. దుకాణాల ముందు కార్లు నిలుపడం, రద్దీ వేళల్లో ఫుట్పాత్లపై వాహనాలు నిలిపివేసి వెళ్లడం, కూడళ్ల వద్ద ఎడమ వైపు వెళ్లేవారికి దారివ్వకపోవడం వంటి గమనిస్తే పోలీసులకు సమాచారం అందించేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలతో ఎంత మంది చనిపోతున్నారో షార్ట్ఫిల్మ్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఎప్పుడైన ప్రమాదాల బారిన పడ్డారనే వివరాలు సేకరించి వారి అనుభవాలను సైతం విద్యార్థులకు వివరిస్తున్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంలో సైతం బైకులపై వెళుతుంటే హెల్మెట్ ధరించాలని సూచనలు చేయడం లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో యేటా వందల మంది చనిపోతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయకూడదు. చిన్ననాటి నుంచే పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పడం వారి భవిష్యత్తుకు మంచిది. స్కూల్స్కు వెళ్లేటప్పుడు రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పిస్తున్నాం. తల్లిదండ్రులకు సైతం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యుల వేదన షార్ట్ ఫిల్మ్ రూపంలో ప్రదర్శిస్తున్నాం. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో వర్క్షాపులు నిర్వహిస్తున్నాం.
– ఆరాధన జైన్, ప్రాజెక్ట్ హెడ్, ట్రాక్స్ఎస్ సొసైటీ