క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ. 1,341.60 కోట్ల అంచనా వ్యయంతో 10 ఏండ్ల కాలపరిమితికి గాను చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు (జీవో నంబరు 196) ఇచ్చింది. గతంలో మార్చి 6న జారీ చేసిన జీవో నం. 91 నిబంధనల స్థానంలో వివిధ భాగస్వామ్య పక్షాల (స్టేక్ హోల్డర్స్) విజ్ఞప్తులు, కమిటీ సిఫార్సుల మేరకు ఈ సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక నిర్మాత, ముఖ్యనేత అనుచరుడు(గతంలో నిర్మాత) అన్నీ తానై తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Street Lights
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ) : క్యూర్ పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.రూ. 1,341.60 కోట్ల అంచనా వ్యయంతో 10 ఏండ్ల కాలపరిమితికి గాను చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు (జీవో నంబరు 196) ఇచ్చింది.
నిబంధనల సవరణలు ఇవే..
క్యూర్ పరిధిలో మొత్తం 7,60,591 ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీఎంఎస్ ప్యానెళ్ల ద్వారా అంతరాయం లేని కాంతిని అందించడం, నిర్వహణ లోపాలను తగ్గించడం, వ్యయ నియంత్రణే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు.
‘ముఖ్య’నేత అనుచరుడి కోసమేనా?
పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారు 4 లక్షల 57 వేల స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను గడిచిన ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్ ) సంస్థ నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదన్న సాకుతో ఆ సంస్థను జీహెచ్ఎంసీ తప్పించింది. ఎల్ఈడీ ప్రాజెక్టును గ్రేటర్లో తొలిసారిగా ప్రవేశపెట్టి ఏడేండ్ల నిర్వహణలో దాదాపు 5 ఏండ్లుగా సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి విద్యుత్ ఆదా రికార్డు స్థాయిలో తగ్గించడం సదరు ఈఈఎస్ఎల్ను గడిచిన రెండేళ్ల కాలంలో పొమ్మనలేక పొగబెట్టారన్న ప్రచారం సాగింది.
అంతేగాకుండా జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనం తర్వాత ఔటర్ వరకు మూడు ట్రై కార్పొరేషన్ల పరిధికి గాను రూ.1341.60 కోట్లతో ప్రతిపాదనను చకచకా సిద్ధం చేయడం, వెంటనే ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక నిర్మాత, ముఖ్యనేత అనుచరుడు(గతంలో నిర్మాత) అన్నీ తానై తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్ నిబంధనలలో మార్పులు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది.
సదరు ముఖ్యనేత అనుచరుడి ఒత్తిడితో టెండర్ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఎవరికి దకుతుందో టెండర్ రాకముందే ఖరారైపోయినప్పుడు ఇక ఈ ప్రక్రియ అంతా ప్రహసనమేనని కొందరు బల్దియా వర్గాలు సైతం లోలోపల వాపోతున్నాయి..ఈఈఎస్ఎల్ వంటి జాతీయ స్థాయి సంస్థలు నిర్వహించిన పనుల్లోనే సమస్యలు తలెత్తగా, ఇప్పుడు 7.60 లక్షల వీధి దీపాల నిర్వహణను కేవలం ఒక్కరికే మేలు చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Ghmc
క్యూర్ పరిధిలో స్ట్రీట్ లైట్ల లెక్కలివి..
కార్పొరేషన్ : వీధి లైట్లు
జీహెచ్ఎంసీ : 3,30,487
సీఎంసీ : 1,85,258
ఎంఎంసీ : 2,44,846
మొత్తం : 7,60,0591