Chain Snatchers | హైదరాబాద్ : సైదాబాద్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండగా, దొంగను ఇద్దరు యువకులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు దొంగను అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. మాదన్నపేటకు చెందిన ప్రకాష్(61) వెల్డింగ్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద కారులో దిగుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ప్రకాష్ చుట్టూ తిరుగుతూ భయబ్రాంతులకు గురి చేసి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. దీంతో ఆ వృద్ధుడు వారిని పట్టుకునే క్రమంలో కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన ఇద్దరు యువకులు ఆ దొంగలను వెంబడించి ఒక దొంగను పట్టుకున్నారు. మరో దొంగ ఆటోలో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.