శామీర్పేట, జూన్ 18 : వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా.. పోలీసులకు సవాల్గా మారిన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. జవహర్నగర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన కటోజు సందీప్చారి జవహర్నగర్లోని శివాజీనగర్లో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉద్యోగం మానేసిన సందీప్ చైన్ స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ముందుగా రెక్కి నిర్వహించి ఒంటరిగా ఉన్న మహిళలు, షాపులను ఎంచుకునేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా.. తన పథకాన్ని అమలు పరుస్తూ వరుసగా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఈ ఘటనలను సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ పుటేజీలు, టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
శుక్రవారం యాప్రాల్ చౌరస్తా వద్ద నిందితుడిని పట్టుకుని విచారించగా.. చైన్స్నాచింగ్లకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 80గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు గతంలో జైలు శిక్షను కూడా అనుభవించినట్లు పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ డీసీపీ శివకుమార్, క్రైమ్ అదనపు డీసీపీ సలీమా, జవహర్నగర్ సీఐ భిక్షపతిరావు, అదనపు సీఐ మధుకుమార్ పాల్గొన్నారు.