ఖైరతాబాద్, మార్చి 21 : కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్ మాట్లాడుతూ, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నిర్మాణంతో పాటు బీసీలందరినీ ఏకతాటిపైకి తీసువచ్చి వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందన్నారు.
ఇందులో రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమీ కనబడటం లేదన్నారు. ఒక మహిళ, మాజీ ముఖ్యమంత్రి కుతూరు, ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న కవితను రూల్ను అతిక్రమించి అరెస్టు చేశారన్నారు. అది కేవలం కేసీఆర్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేసిన ఘన కార్యమన్నారు. బీజేపీ ప్రజా సమస్యలు పట్టించుకోదని, సామాజిక ఉపరితలం రాజకీయాలు చేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడల్లా సామాజికవర్గాల మధ్య ఘర్షణ పెట్టి బతికే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఎవరైనా ఎదురుతిరిగినా, ప్రశ్నించే గొంతుకలున్నా ఈడీ వస్తారు..! ఆ తర్వాత మోదీ వస్తారని ఎద్దేవా చేశారు. కవిత అరెస్టు సమయంలో మోదీ, ఈడీ కలిసి వచ్చారని, అరెస్టు చేయాలన్న అవగాహనతోనే వచ్చారన్నారు.
బలవంతంగా నేరం అంటగట్టాలన్న ప్లాన్తో వచ్చారని, విమానం టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చారంటే అర్థమవుతుందన్నారు. యూపీఎఫ్ కో కన్వీనర్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతుందన్నారు. సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ, కో కన్వీనర్లు నాగేందర్, ముప్పు బిక్షపతి, డి.నరేశ్, ఆలకుంట్ల హరి, మహిళా అధ్యక్షురాలు గీత తదితరులు పాల్గొన్నారు.